పెళ్లి చూపులు లాంటి క్లాసిక్ హిట్ ని తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. తొలి ప్రయత్నమే కమర్షియల్ హిట్ అందుకుని.. జాతీయ అవార్డులతో మోతెక్కించింది ఈ చిత్రం. నంది అవార్డులు కైవశం చేసుకుంది. ఆ తర్వాత అతడి కెరీర్ వెనుదిరిగి చూసేదే ఉండదని అంతా అంచనా వేసారు. కానీ తానొకటి తలిస్తే అన్న చందంగా రెండో ప్రయత్నం విఫలమైంది. ఈ నగరానికి ఏమైంది ఫ్లాపవ్వడం అతడిని చాలానే భయపెట్టింది.
అటుపై తరుణ్ నటన దర్శకత్వం అంటూ రెండు పడవలపై అడుగేశాడు. ఇటీవలే స్నేహితుల కోసం.. శిష్యుల కోసం సినిమాలు చేశాడు. నటించాడు. అయితే తన గమ్యం మాత్రం దర్శకత్వం మాత్రమేనని అతడు ఎప్పుడూ క్లారిటీతో ఉన్నాడని తాజా ప్రయత్నం చెబుతోంది.
ఏడాదిన్నరగా విక్టరీ వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా విషయమై ఆసక్తికర చర్చ సాగుతోంది. గుర్రపు పందేల నేపథ్యం ఉన్న స్క్రిప్టును రెడీ చేసి వెంకటేష్ ని డైరెక్ట్ చేయాలని భావించాడు. కాన్సెప్ట్ ఎంతో వైవిధ్యమైనదే. కానీ ఎందుకనో మధ్యలో డీవియేట్ అయ్యారు. గత సంవత్సరం అధికారిక ప్రకటన తర్వాత తెలియని కారణాల వల్ల టేకాఫ్ చేయలేదు. కొంత గ్యాప్ తర్వాత లేటెస్టుగా తరుణ్ ఇన్ స్టాలో తన మూడవ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు.
“మూడవది నిజంగా నన్ను ఇబ్బందుల్లో పడేసింది. భయం నన్ను దాదాపు చంపేసింది. రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఎంచుకోవడానికి నిజంగా చాలా సమయం పట్టింది ” అని తరుణ్ తన ఇన్ స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. తన తదుపరి చిత్రం ఎగ్జయిట్ చేసే క్రైమ్ డ్రామా అని తెలిపారు. నేను ఆరాధించే స్టార్ తో నేను పని చేస్తున్నాను. ఈసారి నిరాశపరచను. వేచి ఉండండి! అంటూ కాస్త ఎమోషనల్ గానే స్పందించారు తరుణ్ భాస్కర్. దీనిని బట్టి తన ఫేవరెట్ వెంకీతో సినిమాని ఖాయం చేసుకున్నాడనే భావించాల్సి ఉంటుంది. అధికారిక ప్రకటన కోసమే వేచి చూడాల్సి ఉంది.