Templates by BIGtheme NET
Home >> Cinema News >> మిర్చి తోటలో అందాల బొమ్మలు.. తమన్నా కాజల్ సందడి!

మిర్చి తోటలో అందాల బొమ్మలు.. తమన్నా కాజల్ సందడి!

ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నట్టుగా ఉంటాారు.. మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ గాళ్ కాజల్. చూస్తేనే దిష్టి తగులుతుందేమో అనిపించే వీరిని.. దిష్టిబొమ్మలుగా మార్చేశాడో రైతు!

అసలు విషయం ఏమంటే.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన రైతు చంద్రమౌళికి రెండు ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రతీఏటా మిర్చి తోట వేస్తున్నాడు. అయితే.. పంట చేతికి వచ్చే నాటికి ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. ఇలా రెండు మూడేళ్లు జరిగేసరికి.. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు చంద్రమౌళి.

బాగా ఆలోచించి.. మిర్చితోటకు దిష్టిపోయే మార్గం కనుగొన్నాడు. దిష్టిబొమ్మలు పెట్టడం ద్వారా.. నర దిష్టికి చెక్ పెట్టాలనుకున్నాడు రైతు. అయితే.. గడ్డితో చేసే దిష్టిబొమ్మతో నరదిష్టి ప్లాన్ వర్కవుట్ కాదనుకున్నాడో ఏమో.. మనుషుల బొమ్మలు పెట్టేశాడు. అదికూడా.. సాధారణ మనుషుల బొమ్మలు ఎవరు చూస్తారులే అనుకున్నట్టున్నాడు.. ఏకంగా సినీ తారలను దింపేశాడు!

అది కూడా వాళ్లనీ వీళ్లనీ కాకుండా.. జనాల్లో ఫుల్లు ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్లనే తోటకు రప్పించాడు రైతు చంద్రమౌళి. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తమన్నా కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను తయారు చేయించి తోటలో నిలబెట్టాడు. అంటే.. ఇప్పుడు తోటను ఎవరూ పట్టించుకోకుండా.. హీరోయిన్ల బొమ్మలను చూస్తూ వెళ్తారన్న మాట. ఆ విధంగా దిష్టికళ్ల నుంచి తన తోట తప్పించుకుంటుందన్న మాట. ఇదీ.. సదరు రైతు ప్లాన్.

ఈ ఫొటోలను చూసిన పలువురు.. అందాల తారల్ని దిష్టిబొమ్మల్ని చేశాడేంటయ్యా అనకుంటుండగా.. తోటకు అందాన్ని తెచ్చాడులే అనుకుంటున్నారు మరికొందరు. మొత్తానికి.. ఈవెంట్లలో లక్షలాది రూపాయలు తీసుకొని షో చేసే హీరోయిన్లు.. సిద్ధిపేట రైతు తోటలో మాత్రం ఫ్రీగా దిష్టితీసి పెడుతున్నారన్నమాట.

Share via
Copy link