నటుడిగా.. రచయితగా.. దర్శకుడిగా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంటున్న తనికెళ్ల భరణి ‘మిథునం’ సినిమా ను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఆ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు లక్ష్మీలను తనికెళ్ల భరణి చూపించిన తీరు అద్బుతం అంటూ ఇప్పటికి సినిమా గురించి ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తు ఉంటారు. అలాంటి అద్బుతమైన సినిమాను బాలీవుడ్ కు తీసుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి చెప్పుకొచ్చాడు. ఆరు సంవత్సరాలుగా బాలీవుడ్ కు మిథునం తీసుకు వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. అది త్వరలోనే నెరవేరే అవకాశం ఉన్నట్లుగా ఆశాభావం వ్యక్తం చేశాడు.
మిథునం రీమేక్ లో అమితాబచ్చన్ గారు నటించేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. లక్ష్మి పాత్రలో రేఖ ను నటింపజేయాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని భరణి మాటల ద్వారా అర్థం అవుతుంది. దర్శకత్వం వహించే బాధ్యత తానే తీసుకుంటాను అంటూ భరణి పేర్కొన్నాడు. అమితాబచ్చన్.. రేఖ ల మిథునం అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయని ఆయన మాటల ద్వారా అనిపిస్తుంది. మరో వైపు భరణి నటుడిగా బిజీ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మిథునంకు దర్శకత్వం వహించడానికి ముందు తెలుగులో రాఘవేంద్ర రావు తో ఒక సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆ సినిమా విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక భక్త కన్నప్ప సినిమా భరణి డ్రీమ్ ప్రాజెక్ట్. మంచు హీరోతో దాన్ని తీయాలని భరణి భావించారు. కాని ఆ ప్రాజెక్ట్ మద్యలోనే ఆగిపోయింది.