అవును ఆర్.ఆర్.ఆర్ సీత పెళ్లాడబోతోంది. ప్రియుడు రణబీర్ ని ఈ ఏడాది వివాహం ఆడేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందే నేడు (30 డిసెంబర్) రణబీర్ కపూర్ తో అలియా భట్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు బాలీవుడ్ మీడియా కథనాలు హీట్ పెంచేస్తున్నాయి. మంగళవారం ఉదయం.. రణబీర్ కపూర్.. అలియా భట్ ముంబై విమానాశ్రయంలో రణబీర్ తల్లి నీతు సింగ్ తో కలిసి జైపూర్ బయలుదేరారు. ఆ తరువాత రణవీర్ సింగ్ -దీపికా పదుకొనే కూడా పింక్ సిటీకి బయలుదేరడం ఆశ్చర్యపరిచింది.
కొన్ని గంటల్లోనే `బ్రహ్మాస్త్ర` డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా అక్కడ కనిపించారు. మొదట ఈ హడావుడి చూసి బ్రహ్మాస్త్ర చిత్రీకరణ కోసం పింక్ సిటీకి వెళుతున్నారని భావించారు. అయితే పరిశ్రమ గుసగుసల ప్రకారం.. మహేష్ భట్ – రిద్దిమా కపూర్ – ఆదర్ జైన్- కరణ్ జోహార్ వంటి ప్రముఖులు ఇదే చోటికి చేరనున్నారని గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం గోవాలో ఉన్న వారు తెల్లవారుజామున విమానంలో నగరంలో బయల్దేరి జైపూర్ వెళ్లారని సమాచారం.
ఇంతకుముందు ఫోటోల్ని పరిశీలిస్తే.. కలీనా విమానాశ్రయంలో రణబీర్ కపూర్- అలియా- నీతు సింగ్ -రిద్దిమా కపూర్ కనిపించారు. “వీరంతా రణతంబోర్ అమన్ హోటల్ లో దిగారు. మొదట ఇది కేవలం న్యూ ఇయర్ హాలీడే అని అనుకున్నా కానీ సీన్ వేరేగా ఉంది. ఆర్కె – అలియా దగ్గరి స్నేహితులంతా హాజరవుతుంటే ఈ రోజు నిశ్చితార్థం చేసుకుంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ రోజు హోటల్లో క్లోజ్డ్ ఎంగేజ్మెంట్ వేడుక జరగవచ్చని ఇన్ సైడ్ గుసగుసలు వినిపించాయి“
అనేకమంది పరిశ్రమల వర్గాల గుసగుసలు పరిశీలిస్తే.. ఇంకెందుకు ఇలా గంపగుత్తగా కుటుంబం స్నేహితులు కలిసి వెళతారు? ఒకే చోటికి ఎందుకని? తలుపుల మాటున కొన్ని వ్యవహారాలు ఆచారాలు నడుస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది అని వ్యాఖ్యానిస్తున్నారు. సరే నిజంగా నిశ్చితార్థం చేసుకుంటుంటే నవజంటకు శుభాకాంక్షలు. త్వరలోనే దీన్ని అధికారికంగా చేస్తారని భావిద్దాం. రణబీర్- ఆలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర రిలీజ్ కి రావాల్సి ఉంది.