Templates by BIGtheme NET
Home >> Cinema News >> సోనూసూద్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే!

సోనూసూద్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే!

కరోనా లాక్ డౌన్లో ఏ దిక్కూమొక్కూ లేక అవస్థలు పడ్డ ఎంతో మంది కార్మికులను అభాగ్యులను వారి సొంత ప్రాంతాలకు చేర్చి ఆపద్భాందవుడు అయ్యాడు బాలీవుడ్ నటుడు ‘సోనూ సూద్’. సాయం కోసం అర్థించిన ప్రతీ చేతిని ఆప్యాయంగా అందుకుని నేనున్నానంటూ అండగా నిలిచాడు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు సోనూ సూద్. అయితే.. అలాంటి వ్యక్తిపై తాజాగా.. పోలీసులకు ఫిర్యాదు అందింది.

ముంబైలోని ఓ ఆరు అంతస్తుల భవనాన్ని మునిసిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా హోటల్ గా మార్చారన్నది సోనూపై నమోదైన అభియోగం. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా భవనాన్ని హోటల్ గా మార్చారని ఫిర్యాదులో పేర్కొంది బీఎంసీ.

అయితే.. దీనిపై స్పందించాడు సోనూ సూద్. తాను భవనాన్ని హోటల్ గా మార్చడానికి బీఎంసీ పర్మిషన్ తీసుకున్నానని చెప్పాడు. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. అయితే.. కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ పర్మిషన్ రావాల్సి ఉందన్నాడు. దీనికి కూడా దరఖాస్తు చేసుకున్నానని కరోనా కారణంగానే ఈ అనుమతి ఇంకా రాలేదని చెప్పాడు సోనూ. ఒకవేళ అనుమతి రాకుంటే తన హోటల్ ను తొలగిస్తానని చెప్పాడు.

కాగా.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు సోనూ. తాజాగా.. తమ పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం ఇబ్బందులు పడుతున్న వంద మంది సినీ కార్మికులకు 100 స్మార్ట్ ఫోన్లు పంచిపెట్టిన విషయం తెలిసిందే.

Share via
Copy link