తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’ షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక సినిమాలో అత్యంత కీలకమైన ఎంజీఆర్ పాత్రను ప్రముఖ తమిళ స్టార్ నటుడు అరవింద స్వామి చేస్తున్నాడు. ఇప్పటికే అరవింద్ స్వామికి సంబంధించిన ఎంజీఆర్ లుక్ ను రివీల్ చేశారు. ఎంజీఆర్ ఎలా అయితే ఉండేవారో అలాగే అరవింద్ స్వామిని తయారు చేశారు అంటూ ఆసమయంలో ప్రశంసలు దక్కాయి.
కరోనా కారణంగా ఆగిపోయిన తలైవి మూవీ మళ్లీ ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ లో అరవింద్ స్వామి పాల్గొన్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను అరవింద్ స్వామి పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్బంగా ఒక ఫొటోను ఆయన షేర్ చేశాడు. చివరిసారిగా నన్ను ఎంజీఆర్ గా మార్చేందుకు తన పనితనంతో మ్యాజిక్ చేస్తున్న రషీద్ కు కృతజ్ఞతలు అంటూ మేకప్ ఆర్టిస్టును ఉద్దేశించి అరవింద్ స్వామి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు మరియు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.