Templates by BIGtheme NET
Home >> Cinema News >> కరోనా బారిన పడిన మరో మెగా హీరో వరుణ్ తేజ్..!

కరోనా బారిన పడిన మరో మెగా హీరో వరుణ్ తేజ్..!

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ఈరోజు ఉదయం పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని.. ఎటువంటి లక్షణాలు లేవని.. మరింత స్ట్రాంగ్ గా తిరిగి బయటకు వస్తానంటూ రామ్ చరణ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. అలానే గత రెండు రోజుల్లో తనను కలిసిన వారందరిని టెస్ట్ చేయిచుకోవాల్సిందిగా చరణ్ కోరాడు. ఈ క్రమంలో తాజాగా మరో మెగా వారసుడు వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడినట్లు వెల్లడించారు.

వరుణ్ తేజ్ ట్వీట్ చేస్తూ ”ఈ రోజు కోవిడ్ -19 టెస్టులో తేలికపాటి లక్షణాలతో నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీ అభిమానానికి కృతఙ్ఞతలు” అని పేర్కొన్నాడు. అయితే మెగా హీరోలిద్దరూ ఒకరి తర్వాత కరోనా బారిన పడటంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే చరణ్ ఇంట్లో జరిగిన క్రిష్మస్ వేడుకలలో మహమ్మారి సోకినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ పార్టీకి అల్లు అర్జున్ – వరుణ్ తేజ్ – సాయి తేజ్ – నిహారిక సహా మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. మరి వారందరూ టెస్ట్ చేయించుకుంటారేమో చూడాలి. ఇంతకముందు మెగా ఫ్యామిలీలో నాగబాబుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి ముందు కరోనా పాజిటివ్ వచ్చి.. ఆ తర్వాత నెగిటివ్ వచ్చింది. కిట్ లోపం కారణంగానే అలా జరిగినట్లు తెలిసింది.

Share via
Copy link