కేంద్రంలో యు.పి.ఎ.కి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దగ్గరగా రావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడిన మిత్రపక్షాలతో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి ప్రాథమిక కసరత్తు ప్రారంభించింది.
ఈ లెక్కన కాంగ్రెస్తోపాటు డి.ఎం.కె., తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్.సి.పి.) పార్టీలకు మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశ్మీరు వ్యూహంలో భాగంగా అవసరమైతే ఫరూఖ్ అబ్దుల్లాకు ఇచ్చే ఆలోచన ఉంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సోజ్ ఉన్నందున ఫరూఖ్ పేరు చివరివరకూ అనుమానంగానే ఉంది. మెజార్టీ మార్కు చేరుకోడానికి ఇంకా పది సీట్లు అవసరమైనప్పటికీ లాలూప్రసాద్, ములాయంసింగ్ల మద్దతు తీసుకోడానికి కాంగ్రెస్ ఇష్టపడటం లేదు. వారు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చినా మంత్రి పదవులు కేటాయించే ఉద్దేశంలో లేదు. ఆదివారం వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ 'ఎన్నికల ముందు కూటమి భాగస్వాముల'కే అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.
గతం కన్నా ఈసారి మిత్రపక్షాల సంఖ్య తగ్గడంతో కాంగ్రెస్కు మంత్రివర్గంలో సింహభాగం లభించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలు చెరి ఏడు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రెండు పార్టీలూ రైల్వేశాఖ కోసం గట్టిగా పట్టుబడుతుండటం కాంగ్రెస్కు మింగుడు పడటంలేదు. ఈ విషయంలో కలకత్తా కాళి మమతను ఒప్పించి నచ్చజెప్పడం సోనియాగాంధీకి కత్తిమీద సామే.
ఆర్థిక మంత్రిగా మాంటెక్!
చిదంబరం హోంశాఖకు మారిన తర్వాత ఖాళీ అయిన ఆర్థిక మంత్రిత్వ శాఖను ఈసారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్సింగ్ అహ్లూవాలియాకు కట్టబెట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దేశంలోని పరిస్థితులను చక్కదిద్ది ప్రగతిని పట్టాలమీదికి ఎక్కించడానికి ప్రధానికి మాంటెక్సింగ్ను మించిన పేరు కనిపించడంలేదు. గతంలో మాజీ గవర్నర్ రంగరాజన్ పేరుకూడా ఈ పదవికి వినిపించింది. కానీ అది సాకారం కాలేదు. మరోవైపు విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా తనకు ఆర్థిక శాఖే కావాలని కోరుతున్నట్లు సమాచారం. ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ప్రఫుల్ పటేల్లు పాత శాఖల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. హోం, రక్షణ, విదేశాంగ శాఖలపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు సమాచారం. ఈ నాలుగు శాఖల్లో పాత వారే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక శాఖకు వెళ్తే విదేశాంగ శాఖను కమల్నాథ్ లాంటి సీనియర్లకు కట్టబెట్టొచ్చు. యువత నుంచి సచిన్ పైలెట్, మిలింద్ దేవరా, సందీప్ దీక్షిత్, జితిన్ ప్రసాద, జ్యోతిరాదిత్య సింధియాలు మంత్రివర్గంలోకి రావచ్చు.
రాష్ట్రంలో ఎవరికి?
ఇక కాంగ్రెస్కు పార్టీపరంగా అత్యధిక మంది ఎం.పి.లను అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత రెండు పర్యాయాలుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సోపానంగా మారిన మన రాష్ట్రానికి గత కేబినెట్లో ప్రాధాన్యతా పదవులు లభించలేదు. జైపాల్రెడ్డికి మాత్రమే కేబినెట్ పదవి దక్కింది. మిగతా వారంతా సహాయమంత్రి పదవులతో సర్దుకోవాల్సి వచ్చింది. ఈసారి మిత్రపక్షాల ఒత్తిడి పెద్దగా లేనందున రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పదవులు లభించవచ్చన్న అశాభావం వ్యక్తమవుతోంది. ప్రస్తుత కేబినెట్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జైపాల్రెడ్డి, పురంధేశ్వరి కొత్త కేబినెట్లోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అరకు నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందిన సీనియర్ సభ్యుడు కిశోర్ చంద్రదేవ్కు ఈసారి కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో చాలా సీనియర్ కావడంతోపాటు, ఎస్టీ కావడం ఈయనకు ప్లస్ పాయింట్. ప్రస్తుత మంత్రివర్గంలో ఈయనకు సహాయ మంత్రి పదవి ఇవ్వజూపినా ఆయన నిరాకరించారు.
1979లో చరణ్సింగ్ మంత్రివర్గంలోనే సహాయమంత్రిగా పని చేసిన తనలాంటి సీనియర్కు మళ్లీ సహాయమంత్రి పదవినే ఆఫర్ చేయడంతో ఆయన ఒప్పుకోలేదు. అందువల్ల ఈ సారి ఆయనకు కేబినెట్ బెర్త్ దొరకడం ఖాయమన్న భావన కాంగ్రెస్ ఎం.పి.ల్లో వ్యక్తమవుతోంది. లోక్సభ సభాహక్కుల కమిటీ సంఘం అధ్యక్షుడిగా 14వ లోక్సభలో ఆయన మంచి పనితీరు కనబరిచి అందరి ప్రశంసలూ అందుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్తో అంటీముట్టనట్టు ఉండటం ఈయనకు మైనస్. వైఎస్తో వైరం లేకపోయినా మితృత్వం మాత్రం పెద్దగాలేదు. ఈయన రాష్ట్ర రాజకీయాలతో అంటీముట్టనట్టు ఉంటారు. ఈ రెండు తప్పితే మిగతా అన్నీ అంశాలూ ఈయనకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మంత్రిపదవుల కేటాయింపులో సామాజిక న్యాయం, ప్రాంతాల సమతౌల్యం పాటించడం అనివార్యం. గత కేబినెట్లో రెడ్లు, కాపు, కమ్మలకు రెండు చొప్పున బెర్తులు కేటాయించారు. ఎస్సీలకు ఒకటి కట్టబెట్టారు. బీసీలకు అవకాశం దక్కలేదు. ఈసారి ఈ సామాజిక వర్గాలన్నింటికీ మొదటి దఫాలోనే ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి జైపాల్రెడ్డి, సుబ్బరామిరెడ్డి పేర్లు ఉన్నాయి.
సుబ్బరామిరెడ్డిని పక్కన పెడితే సీనియర్లయిన అనంత వెంకటరామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి పేర్లను పరిశీలనలోకి తీసుకోవచ్చు. కమ్మ సామాజికవర్గం నుంచి పురంధేశ్వరి కొనసాగవచ్చు. రేణుకా చౌదరి ఓటమి పాలు కావడంతో ఆ స్థానంలో కావూరి, రాయపాటి సాంబశివరావుల్లో ఎవరో ఒకరికి అవకాశం రావొచ్చు. ఎస్సీల్లో పనబాక లక్ష్మి, చింతామోహన్ల మధ్య పోటీ పడొచ్చు. పనబాకకు ఇది వరకే అవకాశం కల్పించినందున ఈసారి చింతామోహన్ను అదృష్టం వరించవచ్చన్న ఊహాగానం వినిపిస్తోంది. కాపుల్లో పళ్లంరాజు ఎలాగూ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి రెండో బెర్త్ కేటాయిస్తే కడప జిల్లాకు చెందిన సాయి ప్రతాప్కు అవకాశం రావొచ్చు. బీసీ కోటాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు, పార్టీసీనియర్ నేత వి.హనుమంతరావు ఉన్నారు. కేశవరావు తాను పార్టీ కోసమే పని చేస్తానని, మంత్రిపదవి ఇచ్చినా తీసుకోనని చెబుతున్నారు. ఆయన అదేమాటకు కట్టుబడి ఉంటే వి.హనుమంతరావుకు అవకాశం దక్కే అవకాశం ఉంటుంది. బీసీల్లో మధు యాస్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్కుమార్ యాదవ్లు ముగ్గురూ జూనియర్లే కాబట్టి ఈసారి వారికి అవకాశం దక్కకపోవచ్చన్న భావన ఉంది. వృద్ధాప్యం కారణంగా నేదురుమల్లి జనార్దన్రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకోకపోవచ్చన్న వాదన ఉంది.
| Comments |
|
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
- కేంద్ర ప్రభుత్వాని కరుణానిధి భరోసా
- ఎన్నికల్లో గెలవడం గొప్ప అనుభూతి
- 14వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి
- రాజీనామా సమర్పించిన ప్రధాని
- ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రకాష్ మెహ్రా మృతి
- 22న కేంద్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం?
- మాంద్యం సమస్యని సమర్థంగా ఎదుర్కొంటాం
- దంతెవాడలో మావోయిస్టుల కాల్పులు
- కాంగ్రెస్కు ఎస్సీ,ముస్లింల మద్దతు భాజపా
- కాంగ్రెస్కు మద్దతిస్తాం : అమర్సింగ్























